లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ప్రజలు సన్యాసి పాలనను కోరుకుంటుండటంతో యోగి ఆదిత్యానాధ్ తిరిగి సీఎం పీఠంపై ఆశీనులవుతారని బీజేపీ ఎంపీ రవికిషన్ జోస్యం చెప్పారు. గోరఖ్పూర్లో ఓ వార్తాచానెల్తో ఆయన మాట్లాడుతూ విద్యాధికుడు, సన్యాసిగా జీవితాన్ని అంకితం చేసిన యోగి పట్ల ప్రజలు మొగ్గుచూపుతున్నారని అన్నారు. ఏ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిందో ప్రజలకు తెలుసునని అఖిలేష్, మాయావతి హయాంను ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ప్యాలెస్లు, ఫ్యాన్సీ కార్లు, ఫాం హౌస్లు సమకూర్చుకున్న వారిని ప్రజలు పాలకులుగా కోరుకోరని అన్నారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్తో పాటు ఆయన మంత్రివర్గ సహచరులపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి ఓటర్లు మరో అవకాశం ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేండ్లలో జరిగిన అభివృద్ధిని గత దశాబ్ధాలుగా తాము ఎన్నడూ చూడలేదని తాము మహరాజ్జీ (యోగి ఆదిత్యానాధ్)కే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. గోరఖ్పూర్లో పిల్మ్ సిటీ వస్తోందని, భోజ్పురి పరిశ్రమ ఇక్కడ నిలదొక్కుకుంటుందని దీంతో ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
యోగి హయాంలో మాఫియా ముఠాలకు కాలం చెల్లిందని అన్నారు. కాగా, మార్చి 7తో ఏడు దశల పోలింగ్ ముగియనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక కుల సమీకరణలకు పెట్టింది పేరైన యూపీలో యాదవులు ఇతర ఓబీసీలు, ముస్లిం ఓట్ల మద్దతుతో అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ పావులు కదుపుతుండగా యాదవేతర ఓబీసీలు, బ్రాహ్మణులు ఇతర అగ్రకులాల అండదండలతో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దళితుల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ చెమటోడుస్తోంది.