న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత విభేదాలు ముదిరాయి. సొంత పార్టీ నేతలు తనపై విమర్శలపై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. పంజాబ్ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించటం లేదన్న ఆరోపణలను తిప్పికొడుతూ, తాను రాష్ట్రం కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘ఎక్స్’లో ఓ వీడియో క్లిప్ను పంచుకున్నారు. రాజ్యసభలో ఆయన పంజాబ్ సమస్యలపై మాట్లాడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ‘రాఘవ్ చద్దా పంజాబ్ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించటంలో విఫలమయ్యారని అంటున్న నా సహచరులకు ఇదే నా సమాధానం. ఇది ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అభీ బాకీ హై’ అని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించిన తర్వాత ఈ వివాదం మొదలైంది. సొంతపార్టీ నేతలు ఆయనపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై రాఘవ్ చద్దా స్పందిస్తూ, ‘నాపై ఒకే రకమైన ప్రశ్నలు, ఒకే రకమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు.. పరస్పర సహకారంతో చేస్తున్నారు ఇదంతా. నేను మౌనంగా ఉంటే, పదే పదే చెప్పే అబద్ధం.. నిజంలా అనిపిస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.