Mahakaleshwar Temple : మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పది రోజుల పాటు గర్భగుడిలోనికి భక్తులను అనుమతించబోమని తెలిపింది. క్రిస్మస్, నూతన సంవత్సరం ఉన్నందును ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. రద్దీ దృష్ట్యా భక్తులను గర్భ గుడిలోకి అనుమతించ కూడదని ఆలయ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఏడాది ముగింపు సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. దాంతో, భక్తులను గర్భగుడిలోకి అనుమతించకూడదని అనుకున్నాం అని కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు. ఈయన మహకాళేశ్వర్ ఆలయ కమిటీలో సభ్యుడు కూడా. డిసెంబర్ 24 (శనివారం) నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ వరకు ఈ నిబంధన వర్తిస్తుంది. జనవరి 6 నుంచి యథావిధిగా భక్తులను గర్భగుడిలోనికి అనుమతిస్తారు.
మహాకాళేశ్వర్ దేవాలయంలో పరమ శివుడు కొలువై ఉంటాడు. ఈ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దాంతో నిత్యం వేలాది మంది ఈ గుడికి వచ్చి నీలకంఠుడిని దర్శించుకుంటారు. ఈ మధ్యే భద్రతా కారణాల దృష్ట్యా ఆలయంలోకి మొబైల్ ఫోన్లు తీసుకరావడంపై అధికారులు నిషేధం విధించారు. డిసెంబర్ 20 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది. బస చేసే హోటళ్లు, లాడ్జిల్లోనే ఫోన్లు పెట్టి రావాలని భక్తులకు సూచించారు. అంతేకాదు భక్తులు, పర్యాటకుల కోసం ఏసీ బస్సులు కూడా నడపనున్నట్టు వెల్లడించారు.