భోపాల్: కులాంతర వివాహం చేసుకున్న ఒక జంటను గ్రామం నుంచి బహిష్కరించారు. దీని రద్దు కోసం గ్రామ పెద్దలు రెండు లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పౌడీ గ్రామంలోని ఓబీసీ వర్గానికి చెందిన రాజేష్ ప్రజాపతి, ఎస్సీ వర్గానికి చెందిన జ్యోతి ఉతయను ఆరేండ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ జంటను గ్రామ పెద్దలు బహిష్కరించారు. ఈ నేపథ్యంలో రాజేష్ కుటుంబం ఆ గ్రామాన్ని, తమ కుటుంబాలను వీడిపోయింది.
కాగా, తమ తప్పును క్షమించాలంటూ రాజేష్ కుటుంబం కొంత కాలంగా గ్రామ పెద్దలను వేడుకుంటున్నది. గ్రామానికి తిరిగి వచ్చేందుకు వారిని ప్రాధేయపడుతున్నది. గ్రామ పెద్దలు చేసిన కొన్ని డిమాండ్లకు కూడా వారు ఒప్పుకున్నారు. గ్రామస్తులకు విందు ఇవ్వడంతోపాటు భాగవత కచేరీని నిర్వహించారు. దీని కోసం రాజేష్ కుటుంబం చాలా ఖర్చు చేసింది.
అయితే గ్రామ పెద్దలు తాజాగా కొత్త డిమాండ్లు చేశారు. గ్రామ బహిష్కరణను ఎత్తివేసేందుకు రెండు లక్షలు ఇవ్వాలని అడిగారు. దీంతో విసిగిపోయిన రాజేష్, తన భార్యతో కలిసి పోలీసులను ఆశ్రయించాడు. బహిష్కరణ విధించిన గ్రామ పెద్దలపై ఫిర్యాదు చేశాడు. ఆరేండ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు కులాంతర వివాహం చేసుకున్న జంటకు గ్రామ బహిష్కరణ విధించిన ఘటనపై ఫిర్యాదు అందిందని దామోహ్ డీఎస్పీ తనిబార్ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అలాంటి డిమాండ్లు చేసే గ్రామ పెద్దలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.