లక్నో: బహుజన్ సమాజ్వాది పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మరోసారి యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యూపీలోని కాన్పూర్ దెహత్ జిల్లాలో ఆక్రమణల కూల్చివేత సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో తల్లీకూతుళ్లు మరణించిన ఘటనపై మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కంటే తల్లీకూతుళ్ల మరణవార్తే ఎక్కువగా వార్తల్లో నిలిచిందని ఆమె ఎద్దేవా చేశారు.
బీజేపీ బుల్డోజర్ రాజకీయాలు అమాయకులైన పేద ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని, ఇది చాలా విషాదకరమని మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. యోగీ సర్కారు వెంటనే తన ప్రజావ్యతిరేక విధానాలను మార్చుకోవాలని ఆమె హిందీలో ట్వీట్ చేశారు. కాగా, ఆక్రమణల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయిస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ను ప్రత్యర్థులు బుల్డోజర్ బాబా అని మారుపేరుతో పిలుస్తున్నారు.
ఇటీవల కాన్పూర్ దెహత్ జిల్లాలోని ఓ గ్రామంలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇండ్లను కూల్చివేస్తుండగా ప్రజలు అడ్డం తిరిగారు. ఈ సందర్భంగా పోలీసులు కాల్పులు జరపడటంతో ఓ 45 ఏండ్ల మహిళ, ఆమె 20 ఏండ్ల కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉంటే ప్రజలకు మేలు ఎలా జరుగుతుందని మాయావతి ప్రశ్నించారు.