Milk Rate | అమూల్ బాటలో మదర్ డెయిరీ పయనిస్తున్నది. బుధవారం నుంచి లీటర్ పాల ధర రూ.2 పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పాల సేకరణ ధర, ఇతర ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో పాల ధర పెంచక తప్పడం లేదని తెలిపింది. ఇంతకుముందు మార్చిలో లీటర్ పాలపై రూ.2 పెంచేసింది. ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పాల సరఫరా చేస్తున్న ప్రధాన సంస్థల్లో ఒకటి మదర్ డెయిరీ. ప్రతి రోజూ 30 లక్షల లీటర్లకు పైగా పాలను విక్రయిస్తున్నది. బుధవారం నుంచి పెంచిన పాల ధరలు ఇలా అమల్లోకి వస్తాయి.
లిక్విడ్ మిల్క్ పాల ధర రూ.2 పెరుగుతుందని తెలిపింది మదర్ డెయిరీ. ఈ ధర పెంపు అన్ని మిల్క్ వేరియంట్లకు వర్తిస్తుందని పేర్కొంది. ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్ ధర రూ.59 నుంచి రూ.61కి.. టోన్డ్ మిల్క్ లీటర్ రూ.51కి, డబుల్ టోన్డ్ మిల్క్ ధర రూ.45కి పెరుగుతుంది. ఆవు పాలు లీటర్ రూ.53లకు లభిస్తాయి. బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) లీటర్ ధర రూ.46 నుంచి రూ.48కి చేరుకుంది.
గత ఐదు నెలలుగా వివిధ ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోయాయని మదర్ డెయిరీ అధికారులు తెలిపారు. ముడి పాల ధరలు సుమారు 10-11 శాతం పెరిగాయి. గత వేసవి సీజన్లో వేడి తీవ్రత వల్ల పశుగ్రాసం ధర గణనీయంగా పెరిగింది.