న్యూఢిల్లీ : రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అప్రమత్తమైంది. ఈ క్రమంలో విమానాన్ని అత్యవసరం గుజరాత్లోని జామ్నగర్లో ల్యాండ్ చేశారు. 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది.. విమానం నుంచి దిగేశారు. అనంతరం విమానాన్ని నిర్మానుష్య ప్రదేశంలో ఉంచి పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లభించలేదు. బాంబు లేదని తేల్చడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఈ మేరకు రష్యన్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. మాస్కో నుంచి గోవా బయల్దేరిన అజుర్ ఎయిర్ ఫ్లైట్లో బాంబు ఉన్నట్లు సమాచారం రావడంతో.. భారత అధికార వర్గాలు రష్యన్ ఎంబసీని అప్రమత్తం చేశాయని తెలిపింది. ఈ నేపథ్యంలో జామ్నగర్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేసినట్లు పేర్కొంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. విమానంలో పోలీసులు, అధికారులు తనిఖీలు చేశారని రష్యన్ ఎంబసీ ప్రకటించింది.
బాంబు బెదిరింపుల నేపథ్యంలో గోవాలోని దబోలిమ్ ఎయిర్పోర్టు వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఎయిర్పోర్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఉంచారు.