న్యూఢిల్లీ, మార్చి 6: దేశంలో కరోనా క్రమంగా మళ్లీ తీవ్రరూపు దాలుస్తున్నది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 18,327 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 18వేలకు మించి కేసులు నమోదు కావడం 36 రోజుల తర్వాత ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1,11,92,088కు పెరిగింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం.. ఇటీవల పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ర్టాలకు పలు సూచనలు చేసింది. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అనుసరించిన ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్’ విధానాన్ని విధిగా కొనసాగించాలని ఆదేశించింది. వైరస్ కట్టడికి కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలని, ప్రతీ పాజిటివ్ కేసుకు కనీసం 20 మంది కాంటాక్టులకు పరీక్షలు నిర్వహించాలని సూచించింది. మరోవైపు కరోనాను అంతమొందించే వరకు పేటెంట్ హక్కులను రద్దు చేయాలని, దీని వల్ల టీకా సరఫరా గణనీయంగా పెరుగుతుందని డబ్ల్యూహెచ్వో అధిపతి టెడ్రొస్ సూచించారు.
త్వరలో ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో కరోనా టీకా వేయించుకున్నవారికి ఇస్తున్న ధ్రువప్రతాలపై ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను తొలగించాలని కేంద్ర ఆరోగ్య శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది.