ఐజ్వాల్: సాధారణంగా మన దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల సంఖ్యలో కూడా ఎక్కడైనా పురుషులే ఎక్కువ. అయితే, తాజాగా ఓ రాష్ట్రంలో మాత్రం ఈ సంఖ్య తారుమారైంది. అక్కడ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అదే మిజోరం రాష్ట్రం. మిజోరంలో ఇటీవల ఓటర్ల తుదిజాబితాను ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం.. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 23,492 మంది ఎక్కువగా ఉన్నారు.
శనివారం ప్రచురితమైన జాబితా ప్రకారం.. మిజోరంలో మొత్తం 8,33,426 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 4,28,459 మంది మహిళా ఓటర్లు కాగా, 4,04,967 మంది పురుష ఓటర్లు. గత ఏడాది జనవరిలో ప్రచురించిన జాబితాతో పాల్చుకుంటే ఈ జాబితాలో 17,288 మంది ఓటర్లు పెరిగారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఐజ్వాల్ జిల్లాలో అత్యధికంగా 2,76,155 మంది ఓటర్లు ఉన్నారు.
ఆ తర్వాత లుంగ్లేయ్ జిల్లా 97,303 మంది ఓటర్లతో రెండో స్థానంలో ఉన్నది. లుంగ్లేయ్ జిల్లాలో మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019లో కొత్తగా ఏర్పాటైన నాతియాల్ జిల్లాలో అతి తక్కువగా 15,730 మంది ఓటర్లు ఉన్నారు. ఆ జిల్లా మొత్తం ఒక అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్నది. ఇక, మమిత్ జిల్లాలో 7,09,861 మంది, కొలాసిబ్ జిల్లాలో 62,610 మంది, చంఫాయ్ జిల్లాలో 55,357 మంది, సెర్చిప్ జిల్లాలో 52,952 మంది ఓటర్లు ఉన్నారు.
అదేవిధంగా లాంగ్ట్లాయ్ జిల్లాలో 87,608 మందికి, సియాహా జిల్లాలో 43,015 మందికి, సైతువాల్ జిల్లాలో 54,585 మందికి ఖౌజావి జిల్లాలో 17,250 మందికి ఓటుహక్కు ఉన్నది. ఇక మిజోరం రాష్ట్రంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,247 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.