కాన్పూర్ : యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ వరుస పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. యూపీలో గత కొంతకాలంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలతో హడావిడి చేస్తున్న ప్రధాని మంగళవారం కాన్పూర్ మెట్రోను ప్రారంభించడంతో పాటు ఐఐటీ కాన్పూర్ 54వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.
అనంతరం కాన్పూర్ ర్యాలీలో మాట్లాడుతూ బీజేపీ హయాంలో తృతీయ శ్రేణి నగరాల్లోనూ అభివృద్ధి పనులను చేపడుతూ ఆయా నగరాల రూపురేఖలు మార్చేస్తున్నామని అన్నారు. యూపీలో మెట్రో రైలు పనులు అసాధారణ సమయంలో పూర్తవుతున్నాయని కితాబిచ్చారు.
యూపీలో గత ప్రభుత్వాలు స్వార్ధ ప్రయోజనాల కోసం పనిచేసాయని ఆరోపించారు. గత పాలకులు మాఫియా ఇజంతో పరిశ్రమలు, వ్యాపారాలను దెబ్బతీశారని మండిపడ్డారు. యూపీలో ఇటీవల పట్టుబడిన నగదు వ్యవహారం విపక్షం నిర్వాకాన్ని బట్టబయలు చేసిందని దుయ్యబట్టారు.