లక్నో: త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నకిలీ మోదీ సిద్ధమయ్యాడు. ఈయన సరోజినీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. మోదీని పోలీ ఉండటంతో తనకు ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని అభినందన్ పాఠక్ అంటున్నాడు. లక్నో మహా నగరంలో దోసకాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే అభినందన్ పాఠక్.. అచ్చం మోదీలాగే ముఖవర్చస్సు కలిగి ఉండి ప్రజలకు పరిచితులుగా మారారు.
ప్రధాని మోదీని పోలీ ఉన్న వ్యక్తిగా పేరు గడించిన షహరాన్పూర్కు చెందిన అభినందన్ పాఠక్ (56) బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డాడు. దాంతో స్వతంత్రుడి రంగంలో దిగాలని నిర్ణయించుకున్నాడు. లక్నోలోని సరోజినీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యాడు. ‘తనకు టికెట్ కేటాయించాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్షాకు లేఖ రాసి కోరినా వారు పట్టించుకోలేదు. దాంతో ఇండిపెండెంట్గా బరిలో నిలవాలని నిశ్చయించుకున్నా’ అని అభినందన్ పాఠక్ చెప్పారు. ఈ స్థానం నుంచి 2017 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్వాతి సింగ్ గెలిచారు. ఇప్పుడు ఆమె భర్త దయాశంకర్ సింగ్ అక్కడి నుంచి పోటీచేసేందుకు బీజేపీ టికెట్ కోరుతున్నారు. దయాశంకర్ సింగ్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
నకిలీ మోదీకి బీజేపీ టికెట్ నిరాకరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఈయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం తోసిపుచ్చింది. ‘అయినప్పటికీ మోదీ అభిమానిగా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నాను. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి రెండోసారి యోగి ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరిస్తా’ అంటున్నారాయన. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లగా అక్కడ పాఠక్ను పట్టించుకునే వారు కరవయ్యారు. ‘పార్టీపై ఉన్న అభిమానంతోనే ఛత్తీస్గఢ్లో ఎన్నికల్ల ప్రచారం జరిపాను’ అని నకిలీ మోదీ చెప్పారు. 1999 లోక్సభ ఎన్నికల్లో షహరాన్పూర్ నుంచి స్వతంత్రుడి పోటీ చేసిన పాఠక్.. ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. దాంతో ఆయన భార్య విడాకులు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించింది.