హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): నీతులు ఎదుటివాడికి చెప్పేందుకే తప్ప తాను ఆచరించడానికి కాదన్న సామెత ప్రస్తుతం మోదీ సర్కారుకు బాగా వర్తిస్తుంది. అప్పులుచేయడంలో తనకు తాను కావలసినన్ని వెసలుబాట్లు ఇచ్చుకొనే కేంద్రం.. రాష్ర్టాలపై మాత్రం ఆంక్షలు విధిస్తున్నది. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని తుంగలోకి తొక్కి.. నచ్చినట్టు మార్చుకొంటున్నది. రాష్ర్టాలను ఆంక్షలతో వేధిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులను నియంత్రించే లక్ష్యంతో 2003లో ఎఫ్ఆర్బీఎం చట్టం (ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) తెచ్చారు. కేంద్ర, రాష్ర్టాల ఆదాయ, వ్యయాలు, అప్పులు పారదర్శకంగా జరిగేలా చూడటం దీని లక్ష్యం. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, ప్రాథమిక లోటు, పన్నులు, పన్నేతర ఆదాయలోటు ఏ స్థాయిలో ఉండాలో లక్ష్యాలు పెట్టారు. ముఖ్యంగా రాష్ర్టాలు తీసుకొనే రుణాలను కేంద్రం నియంత్రణలోకి తెచ్చారు.
ఏనాడూ లక్ష్యాలను చేరని కేంద్రం..
ఎఫ్ఆర్బీఎం చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదట ఐదేండ్ల లక్ష్యాలను నిర్దేశించారు. 2008-09 నాటికి రెవెన్యూ లోటును 0 శాతానికి తీసుకురావాలని, ద్రవ్యలోటును 3 శాతానికి తగ్గించాలని, అన్ని రకాల అప్పులను జీడీపీలో 9.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. అయితే 2009 నాటికి కేంద్రం పూర్తిగా లక్ష్యాలను చేరలేదు. పైగా అప్పులు ఏటికేడు పెరిగిపోయాయి. దీంతో చట్టంలో మార్పులు చేసి మొదట 2012 వరకు, ఆ తర్వాత 2015 వరకు పొడిగించారు. అయినా రెవెన్యూలోటు జీరో కాలేదు.. ద్రవ్యలోటు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. అయితే కేంద్రం ఇష్టారీతిన అప్పులు చేయకుండా మాత్రం యూపీఏ సర్కార్ నియంత్రించగలిగింది. ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేయడం నిషేధించింది. తద్వారా ఆర్బీఐ వద్ద ఉన్న నిధులపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడగలిగింది.
ఆగమాగం చేసిన మోదీ
మోదీ ప్రధాని అయ్యాక ఎఫ్ఆర్బీఎం చట్టంలో మార్పుల కోసం కేంద్రం 2016లో ఎన్కే సింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ద్రవ్యలోటును 2020 మార్చి 31 నాటికి 3%కి తగ్గించాలని, 2021 నాటికి 2.8%కి, 2023 నాటికి 2.5%కి తగ్గించాలని నిర్దేశించింది. రెవెన్యూ లోటును 0.8%కి తగ్గించాలని స్పష్టంచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు కలిపి జీడీపీలో 60% (కేంద్ర రుణాలు 40%, అన్ని రాష్ర్టాల రుణాలు 20%) మించకూడదని స్పష్టంచేసింది. 2017 నాటికి రుణాలు జీడీపీలో 70%గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్రం 2018లో ఎఫ్ఆర్బీఎం చట్టంలో మార్పులు చేసింది. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. చివర్లో ఒక చిన్న మెలిక పెట్టింది. దీని ప్రకారం కేంద్రం ద్రవ్యలోటు లక్ష్యాలను 0.5% సవరించుకోవచ్చు. పైగా.. ప్రభుత్వ బాండ్ల వేలంలో ఆర్బీఐ నేరుగా పాల్గొని, కొనుగోలు చేసే అవకాశం ఇచ్చింది. తద్వారా ఆర్బీఐ వద్ద ఉన్న నిల్వలను కేంద్రం తన ఇష్టారీతిన వాడుకొనేందుకు అవకాశమిచ్చింది.
రెండేండ్ల ముందు హడావుడి
15వ ఫైనాన్స్ కమిషన్ అంచనాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం అప్పులు జీడీపీలో 57.6%, రాష్ర్టాల అప్పులు 30.7%. కేంద్రం మూలధన వ్యయం కింద రాష్ర్టాలకు ఇచ్చే రుణాలు 3.4% ఉండొచ్చు. కేంద్రం ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం 2018లో నిర్దేశించుకున్న లక్ష్యాల గడువు 2023తో ముగుస్తున్నది. ఇందుకు మరో రెండేండ్లే సమయం ఉండటంతో కేంద్రం ఇప్పుడు రాష్ర్టాల మెడపై కత్తి పెడుతున్నది. అప్పుల భారాన్ని తాము 57.6% నుంచి 40%కి తగ్గించుకుంటామని, రాష్ర్టాలు 10%తగ్గించుకోవాలని ఒత్తిడితెస్తున్నది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు బడ్జెటేతర రుణాలను సైతం అప్పుల్లో కలుపాలని కేంద్రం ఆదేశించింది. తాము ఎఫ్సీఐ, నేషనల్ హైవేఅథారిటీల కోసం చేసిన అప్పులను కలిపినట్టు చెప్పింది.
కేంద్రానికి న్యాయం: మూలధన వ్యయం కింద రాష్ర్టాలకు ఇచ్చిన రుణాలను మాత్రం ఇందులో కలుపుకోలేదు. ఇది జీడీపీలో 3.4 శాతం ఉంటుందని అంచనా.
రాష్ర్టాలకు అన్యాయం: రాష్ర్టాలు మూలధన వ్యయం కోసం కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను మాత్రం బడ్జెటేతర అప్పులుగా పరిగణించి, రాష్ట్ర రుణాల్లో కలిపేసింది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు సేకరించి, ప్రజోపయోగ ప్రాజెక్టులు నిర్మించింది. ఇవి సంపూర్ణంగా పూర్తయితేనే ఆయా కార్పొరేషన్లు తిరిగి చెల్లించే స్థితికి చేరుతాయి. అప్పటిదాక ఆగకుండా వెంటనే వాటిని రాష్ట్ర అప్పులుగా గణించాలని కేంద్రం ఒత్తిడి తెస్తున్నది.
అప్పులు ఎట్లా తీరుస్తరు?
కేంద్రానికి న్యాయం: రుణాల భారాన్ని దించుకునేందుకు కేంద్రానికి అనేక మార్గాలున్నాయి. కేంద్రానికి ఆదాయ వనరులు ఎక్కువ. సబ్సిడీలు తగ్గించడం, పన్నుల భారం పెంచడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోగలదు. గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత, ధరల పెంపు ఇందులో భాగమే. దీంతోపాటు అనేక పీఎస్యూలను అగ్గువకే అమ్మేస్తున్నది.
రాష్ర్టాలకు అన్యాయం: రాష్ర్టాలకు ఒక్కసారిగా జీఎస్డీపీలో పదుల శాతం ఉన్న రుణ భారం తీర్చుకునే స్థోమత లేదు. 2021-22 అంచనాల ప్రకారం దేశంలోనే అత్యధికంగా పంజాబ్ అప్పులు జీఎస్డీపీలో 53.3%, రాజస్థాన్ 39.8%, బెంగాల్ 38.8%, కేరళ 38.3%, ఏపీ 32.4% ఉన్నాయి. ఇవన్నీ 20% కన్నా దిగువకు రావాలంటే.. ఎలా సాధ్యం? కనీసం రుణ పరిమితిని పెంచుకునే అవకాశం కూడా లేదు.
నిజంగానే 15వ ఆర్థిక సంఘం చెప్పిందా?
బడ్జెటేతర అప్పులను కేంద్ర, రాష్ట్ర రుణాల్లో కలుపడం, అప్పుల భారాన్ని తగ్గించడం వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ వేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. కేంద్ర ఆర్థిక మంత్రి గతంలోనే ఈ సిఫారసులను ‘సరైన సమయంలో పరిశీలిస్తాం’ అని పక్కన పెట్టేశారు. కమిటీలు, నివేదికలు లేకుండానే ఇప్పుడు ఆర్థిక సంఘం చెప్పిందంటూ ఆంక్షల కత్తి పెడుతున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఒకవేళ 15వ ఆర్థిక సంఘం సిఫారసులనే అమలు చేయాలన్నా.. 2020-21 నుంచి తీసుకున్న బడ్జెటేతర రుణాలను మాత్రమే రాష్ట్ర అప్పుల్లో కలుపాలి. కానీ కేంద్రం పాత రుణాలను సైతం కలుపుతూ తీవ్ర అన్యాయం చేస్తున్నది.