న్యూఢిల్లీ : జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ జరుగనుండగా.. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. మంగళవారం టోక్యో వేదికగా జరిగే క్వాడ్ సదస్సు జరుగనున్నది. ఈ సందర్భంగా సమావేశంలో ఉక్రెయిన్ పరిస్థితిపై చర్చించనున్నారు. సమావేశంపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్లోని పరిస్థితులపై ఇప్పటికే జరిగిన చర్చల్లో భాగంగానే సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. జపాన్ పర్యటనకు ముందు ప్రధాని మోదీ సైతం అమెరికా అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనున్నట్లు చెప్పారు.
బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకునే మార్గాలపై ఇరుదేశాలు చర్చిస్తాయని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధి, సమకాలీన ప్రపంచ సమస్యలపై సంభాషించనున్నట్లు మోదీ పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా మాట్లాడుతూ ఉక్రెయిన్పై తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ఇదే విషయాన్ని పలుసార్లు పునరుద్ఘాటించినట్లు చెప్పారు. ఫిబ్రవరిలో పరిస్థితులు క్షీణించడం ప్రారంభించిన నాటి నుంచి ఇరుదేశాలు చర్చల మార్గాన్ని అనుసరించాలని సూచించినట్లు పేర్కొన్నారు.