Goa | గోవా ఎన్నికల జాబితాలో ఉత్పల్ పర్రీకర్ పేరు లేకపోవడంపై గోవా మంత్రి విశ్వజిత్ రాణే స్పందించారు. ఆయన ఒకరి కుమారుడు కాబట్టి పార్టీ మద్దతివ్వాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. గోవాలో బీజేపీ ఎదగడంలో మాజీ సీఎం మనోహర్ పర్రీకర్ పాత్ర విశేషంగా ఉందని, ఆయన కుమారుడు ఉత్పల్ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేయకుంటేనే బాగుటుందని రాణే అభిప్రాయపడ్డారు. గోవాను అత్యధిక రోజులు పాలించిన ఘనత మనోహర్ పర్రీకర్ సొంతమని, అందులో అనుమానమేమీలేదన్నారు. అయితే ఉత్పల్ మాత్రం పార్టీలో పనిచేయాలని, పని విధానం నేర్చుకోవాలని, ఎదగాలని సూచించారు.
‘ఒకరి కుమారుడు అయినంత మాత్రాన టిక్కెట్ ఇవ్వాలని ఏమీ లేదు. అలా టిక్కెట్ దొరకుతుందనీ లేదు. టిక్కెట్ ఇస్తేనే ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపించినట్లేమీ కాదు. ఉత్పల్ పర్రీకర్ ముందు బీజేపీలో పనిచేయాలి. నేర్చుకోవాలి. ఎదగాలి.’ అని మంత్రి విశ్వజిత్ రాణే సూచించారు. ప్రస్తుత ఎమ్మెల్యే అటానాసియో బాబుష్ మాన్సరేట్కు పణాజి టిక్కెట్ ఇచ్చామని, అయితే గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గం కోసం ఆయన మంచి పనులు చేశారని, వాటిని ప్రజలు చూశారని, అందుకే టిక్కెట్ ఇచ్చామని విశ్వజిత్ రాణే స్పష్టం చేశారు.
గోవా మాజీ సీఎం మనోహర్ పర్రీకర్ కుమారుడు ఉత్పల్ పర్రీకర్ పేరు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో లేకపోవడంతో తీవ్ర విమర్శలు చెలరేగుతున్న విషయం విదితమే. అయితే ఈ విషయంపై గోవా వ్యవహారాల ఇన్చార్జీ దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. రెండు ఆప్షన్లు ఇచ్చామని, మొదటి ఆప్షన్కు పర్రీకర్ నో చెప్పారని, రెండో ఆప్షన్కు ఓకే చెబుతారన్న నమ్మకం మాకుందని ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వైపు ఆమ్ఆద్మీ నుంచి పోటీలోకి దిగాలని ఉత్పల్ను సీఎం కేజ్రీవాల్ ఆహ్వానించారు. తనను బీజేపీ వాడుకొని వదిలేసిందని, అందుకే ఆమ్ఆద్మీలోకి రావాలని కేజ్రీవాల్ ఆహ్వానించారు. ఇక శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా స్పందించారు. పర్రీకర్ గనక స్వంతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే, తప్పకుండా మద్దతిస్తామని రౌత్ ప్రకటించారు.