న్యూఢిల్లీ: నీట్ ప్రశ్న పత్రం లీక్ వెనుక ఉన్న వారిని శిక్షిస్తామని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ పోలీసులతో హింసాత్మక ఘర్షణలు జరిగిన మరుసటి రోజు మంగళవారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి చెందిన వేలాది మద్దతుదారులు మళ్లీ జంతర్ మంతర్ వద్ద తమ నిరసనను కొనసాగించారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వైపుగా ర్యాలీ చేపట్టిన నిరసనకారులు సోమవారం పోలీసులతో హింసాత్మక ఘర్షణలకు దిగిన నేపథ్యంలో జంతర్ మంతర్ నిరసన స్థలి వద్ద 5,000 మందికిపైగా నిరసనకారులు నిరసనకు దిగారు. సెంట్రల్ ఢిల్లీలో సోమవారం జరిగిన ఘర్షణల్లో 118 మంది భద్రతా, పోలీసు సిబ్బంది, 60 మంది నిరసనకారులతో సహా దాదాపు 180 మంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే వివిధ దవాఖానలలో 150 మందికి పైగా నిరసనకారులు చికిత్స పొందుతున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఈ అనాగరిక ఢిల్లీ పోలీసులు మా విద్యార్థులను, సహచరులను చితకబాదారు. మేము మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తాం. ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు వెనక్కి తగ్గం అని ఆయన స్పష్టం చేశారు.