న్యూఢిల్లీ : టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కారు ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు మెర్సిడెజ్ బెంజ్ హాంకాంగ్ నుంచి ముంబైకి అధికారుల బృందాన్ని పంపింది. ప్రమాదంలో సైరస్ మిస్త్రీతో పాటు మరో వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. మెర్సిడెజ్ బెంజ్ నిపుణులు బృందం ప్రమాదంతో పాటు పొరపాటు ఏంటో దర్యాప్తు చేయనున్నది. ముగ్గురు నిపుణులతో కూడిన బృందం హాంకాంగ్ నుంచి ముంబైకి వచ్చినట్లు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పోలీసు అధికారుల సమక్షంలో బృందం దర్యాప్తు చేస్తుందని తెలిపాయి.
రోడ్డు ప్రమాదానికి గురైన కారు థానేలోని మెర్సిడెట్ బెంజ్ యూనిట్లో ఉండగా.. బృందం కారును పరిశీలించి.. నివేదికను మెర్సిడెజ్ బెంజ్కు సమర్పించనున్నది. ప్రమాదానికి సంబంధించి తుది నివేదికను కార్ల కంపెనీ తర్వాత పోలీసులకు సమర్పిస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. సైరస్ మిస్త్రీ, అతని స్నేహితుడు జహంగీర్ పండోల్ మెర్సిడెజ్ బెంజ్ కారులో ప్రయాణిస్తూ ఈ నెల 4న ముంబై పాల్ఘర్ జిల్లాలో వంతెనను ఢీకొట్టగా.. మృతి చెందారు. కారు నడుపుతున్న అనహిత పండోల్, ఆమె భర్త డారియస్ పండోల్ గాయపడ్డ విషయం తెలిసిందే. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.