న్యూఢిల్లీ: పాక్ ప్రేరేపిత ఉగ్రముఠాను ఇటీవల అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టారు. రాబోయే పండగల సీజన్లో భారీ ఉగ్ర దాడులకు పాల్పడేందుకు కుట్రపన్నిన ఆరుగురు ముష్కరులు.. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల తరహా దాడులకు ప్లాన్ వేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను ఎంచుకున్న వీళ్లు.. రెక్కీ కూడా నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి 1.5 కిలోల ఆర్డీఎక్స్ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కాగా 1993 మార్చి 12న ముంబైలో 12 వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో జరిగిన ఈ పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,400 మంది గాయపడ్డారు. ఈ దాడికి ప్రధాన సూత్రదారైన యాకుబ్ మేమన్ను 2015లో ఉరితీశారు.