ముంబై : మీ సమస్యలు తీర్చేందుకు ప్రార్ధనలు చేస్తామంటూ మహిళల ఇండ్లలోకి చొరబడి నగదు, నగలతో ఉడాయించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు తాము దేవుడి అవతారంగా చెప్పుకుంటూ వీరు మహిళలను బురిడీ కొట్టించారు.
ముంబైలో ఎనిమిది మందితో కూడిన ఈ ముఠా ఇప్పటివరకూ ఈ తరహాలో 50 మంది మహిళలను మోసగించిందని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 18న తాను ఒంటరిగా ఉన్న సమయంలో సాధువు వేషంలో ఓ వ్యక్తి తమ ఇంటికి వచ్చాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.
ప్రార్ధనలతో సమస్యలను పరిష్కరిస్తానని నమ్మబలికిన సాధువు ఆమె వద్ద నుంచి రూ 28,000 నగదు రూ 75,000 విలువైన మంగళసూత్రాన్ని తీసుకుని ఆపై ఉడాయించాడు. మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ కెమెరాలను చెక్ చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన ఇతర సభ్యులను అరెస్ట్ చేసేందుకు గాలింపు ముమ్మరం చేశారు.