రాయ్పూర్: దేశం, రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఏ ఊళ్లో చూసిన సీసీ రోడ్లు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు ఇంటింటికి తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, వైద్య సౌకర్యాలు ఇతర వసతులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బల్రామ్పూర్ జిల్లాలోని పిప్రదీహ్ అనే ఊరు మాత్రం అభివృద్ధి ఫలాలకు ఆమడ దూరంలో ఉన్నది. తాగునీటి వసతి లేదు, పిల్లలు చదువుకోవడానికి బడిలేదు. ఏదైనా అనారోగ్యం వస్తే చూపించుకోవడానికి వైద్య సౌకర్యం లేదు.
ఈ పిప్రదీహ్ గ్రామంలో 50కి పైగా ఇండ్లు 200లకు పైగా జనాభా ఉన్నారు. వీరంతా పాండో అనే గిరిజన తెగకు చెందినవారు. ఇప్పటివరకూ అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరుగలేదు. మహిళలు తాగునీటి కోసం బిందెలు తీసుకుని రెండు మూడు కిలోమీటర్లు నడిచి బావుల దగ్గరికి పోవాలె. పిల్లలు బడికి వెళ్లాలంటే 5 కిలోమీటర్లు నడువాలె. వైద్యం కావాలన్న నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉన్న టౌన్కు వెళ్లాల్సిందే. నాయకులు ఎన్నికలప్పుడు వచ్చి తమ సమస్యలు వింటారని, పరిష్కరిస్తామని హామీలు కూడా గుప్పిస్తారని, కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత వాళ్లు కనపడరని గ్రామస్తులు చెబుతున్నారు.