ఇంపాల్ : మైతీ వర్గానికి చెందిన అరంబై తెంగోల్ సభ్యులు.. మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు.. ఇవాళ ఆయుధాలను సరెండర్ చేశారు. ఈనెల 25వ తేదీన గవర్నర్ భల్లాతో జరిగిన మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్లో కొన్నాళ్లుగా రెండు తెగల మధ్య ఘర్షణ చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. హింసాత్మకంగా మారిన ఆ ఘర్షణల్లో వందల సంఖ్యల జనం మరణించారు.
#WATCH | Imphal | The members of ‘Arambai Tengol’- a Meitei organisation, today surrendered their arms following their meeting with Manipur Governor Ajay Kumar Bhalla on Feb 25 pic.twitter.com/J8NIc1LkI0
— ANI (@ANI) February 27, 2025
రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 104 తుపాకులను, మందుగుండు సామాగ్రిని ప్రభుత్వానికి సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. కంగ్పోప్కీ, ఇంపాల్ ఈస్ట్, బిష్ణుపుర్, తౌబాల్, ఇంపాల్ వెస్ట్, కాక్చింగ్ జిల్లాల్లో ఆయుధాలను అప్పగించారు. ప్రభుత్వ దళాల నుంచి అక్రమంగా లూటీ చేసిన ఆయుధాలను వారం రోజుల్లోగా సరెండ్ చేయాలని ఫిబ్రవరి 20వ తేదీన రాష్ట్ర ప్రజల్ని గవర్నర్ కోరారు.
ఈ నేపథ్యంలో అరంబై తెంగోల్ గ్రూపు సభ్యులు ఇవాళ ఆయుధాలను అప్పగించారు. ఆయుధాలను సరెండర్ చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం తెలిపింది. తమ షరతులకు అంగీకరిస్తే ఆయుధాలు సరెండర్ చేస్తామని మైతీ గ్రూపు పేర్కొన్నది. ఆ సంస్థ పీఆర్వో రాబిన్ మాన్గంగ్ కవైరక్పార్.. గ్రూపు తరపున గవర్నర్ను కలిశారు. ఆయుధాల అప్పగింతకు గడవు వెల్లడించలేదు.
#WATCH | Imphal | The members of ‘Arambai Tengol’- a Meitei organisation, today surrendered their arms following their meeting with Manipur Governor Ajay Kumar Bhalla on Feb 25 pic.twitter.com/GUboHG3lui
— ANI (@ANI) February 27, 2025
గవర్నర్ భల్లాకు అరంబై తెంగోల్ ఓ మెమోరండంను సమర్పించింది. మెజారిటీ మైతీ వర్గానికి ఎస్టీ స్టాటస్ ఇవ్వాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. మైతీ తెగలకు ఎస్టీ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. 2023 మే నెలలో మణిపూర్లో భారీ ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో ఊచకోత ప్రారంభమైంది. కుక్కీ గిరిజనుల్ని నిర్దాక్షిణ్యంగా చంపినట్లు అరంబై తెంగోల్పై ఆరోపణలు వచ్చాయి.
మణిపూర్లో హింస చోటుచేసుకున్న సమయంలో.. అరాచక శక్తులు .. పోలీసు స్టేషన్లు, ఔట్ పోస్టుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. లూటీ అయిన ఆరు వేల ఆయుధాల్లో ఇప్పటి వరకు 2500 ఆయుధాలు మాత్రమే సరెండర్ చేశారు. రెండు వర్గాల హింసలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. మైతీలు హిందూ కులస్థులు. వాళ్లు ఎక్కువ శాతం ఇంపాల్ లోయ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. కుక్కీల్లో ఎక్కువ శాతం క్రైస్తవులు ఉన్నారు. వాళ్లు కొండల్లో జీవిస్తుంటారు. అయితే రెండు వర్గాల ప్రజల మధ్య ఇప్పుడు బలోపేతమైన బఫర్ జోన్లను ఏర్పాటు చేశారు.