న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా ఆకస్మిక దాడిపై ప్రపంచ దేశాలతోపాటు భారత్ ఆందోళన చెందుతున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులతో సహా సుమారు 18,000 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి భారత్కు తిరిగి తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ తెలిపారు. ఉక్రెయిన్లో గగనతలం మూసివేయడంతో భారత పౌరుల తరలింపు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆ దేశంలోని భారతీయుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని అన్నారు.
మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కైవ్లో భారత రాయబార కార్యాలయం కొనసాగుతున్నదని ఆ దేశంలోని భారత రాయబారి పార్థ సత్పతి తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు జరుగుతున్నప్పటికీ భారత రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని చెప్పారు. ఉక్రెయిన్లోని భారతీయులు ఎక్కడ ఉన్నవారు అక్కడ నిశ్చితంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితిని నిబ్బరంతో ఎదుర్కోవాలని సూచించారు.
అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎమర్జెన్సీ నంబర్ల ద్వారా తమను సంప్రదించాలని ఉక్రెయిన్లో భారత రాయబారి పార్థ సత్పతి కోరారు. అప్డేట్ సమాచారం కోసం ఎంబసీ సామాజిక మాధ్యమాలైన ఫెస్బుక్, ట్విట్టర్లను అనుసరించాలని సూచించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితికి పరిష్కారం కోసం భారత ప్రభుత్వం మిషన్ మోడ్లో పని చేస్తున్నదని తెలిపారు. ఈ మేరకు కొన్ని సూచనలతో కూడిన ప్రకటనను విడుదల చేశారు.