హైదరాబాద్: ‘టీ20 క్రికెట్ ప్రపంచకప్లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఓడిపోవడానికి బౌలర్ మహ్మద్ షమీ ఒక్కడే బాధ్యుడా..?’ అని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) ప్రశ్నించారు. సోషల్ మీడియాలో మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ కామెంట్లు వర్షం కురుస్తుండటంపై అసదుద్దీన్ స్పందించారు. షమీని ఒక్కడినే టార్గెట్ చేయడం ముస్లింలపట్ల వ్యతిరేకతను, ద్వేషాన్ని తెలియజేస్తున్నదన్నారు.
ఆట అన్నాక గెలుపు, ఓటములు సహజమని ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. జట్టులో మొత్తం 11 మంది ఆటగాళ్లు ఉంటే కేవలం ఒక ముస్లిం ప్లేయర్ను మాత్రమే ఎలా టార్గెట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తదా.. అని ఓవైసీ నిలదీశారు. ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది. భారత్ విధించిన 152 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ ఒక వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది.