న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించే నైతిక హక్కు లేదని, ఈ కార్యక్రమాల్లో తమ పార్టీ పాల్గొనబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని పూర్తి నిబద్ధతతో అనుసరిస్తున్నామా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రయోజనాలు ఆయా వర్గాలకు చేరడం లేదని మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పన దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఎలాంటి చట్టాలను తీసుకురావడం లేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పి వారి లబ్ధి కోసం అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని మాయావతి డిమాండ్ చేశారు.