మథుర: షాహి ఈద్గా మసీదుపై సర్వే చేపట్టాలని యూపీలోని మథుర కోర్టు ఆదేశించింది. ఆ మసీదును శ్రీకృష్ణుడి జన్మస్థలంపై నిర్మించినట్లు పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి రెండో తేదీన ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో ఆ సర్వే చేపట్టాలని కోర్టు తెలిపింది. జనవరి 20వ తేదీ తర్వాత రిపోర్ట్ను అందజేయనున్నారు. హిందూ సేనకు చెందిన విష్ణు గుప్త ఈ కేసులో పిటిషన్ దాఖలు చేశారు. వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసు తరహాలోనే.. ఈ కేసులోనూ సర్వే చేపట్టనున్నారు.
కట్రా కేశవ్ దేవ్ ఆలయంలో ఉన్న 17వ శతాబ్ధం నాటి షాహి ఈద్గా మజీదును తొలగించాలని హిందూ సేన డిమాండ్ చేస్తోంది. కృష్ణ భగవానుడు పుట్టిన ప్రదేశంలో ఆ మసీదును నిర్మించినట్లు హిందూ సేన ఆరోపిస్తోంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు ఆ మసీదును నిర్మించినట్లు తెలిపారు. కట్రా దేవ్ ఆలయం సుమారు 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ ఆలయ పరిసరాల్లో దీన్ని నిర్మించారు.