Mary Kom : భారత బాక్సింగ్ దిగ్గజం (Boxing Legend), ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ (Mary Kom) క్రీడా రంగం నుంచి వినోద రంగంలోకి ప్రవేశించారు. ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్బాస్ 20 (Big Boss 20)’ లో కంటెస్టెంట్గా ప్రవేశించిన ఆమె.. ఈ సందర్భంగా భారత బాక్సింగ్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన తర్వాత మరో ‘మేరీ కోమ్’ రావడం అసాధ్యమని, తన వారసత్వాన్ని అందుకునే సత్తా ప్రస్తుత తరం బాక్సర్లలో కనిపించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
మేరీ కోమ్ మాట్లాడుతూ.. ‘నా తర్వాత మరో మేరీ కోమ్ ఎవరని అడిగితే నా సమాధానం ‘ఎవరూ లేరు’ అనేనని మేరీకోమ్ స్పష్టంచేశారు. దీనికిగల కారణాలను వివరిస్తూ.. ఇప్పటి యువ బాక్సర్లలో క్రమశిక్షణ, నిలకడ లోపించాయని అన్నారు. “చాలా మంది బాక్సర్లు ఉన్నారు. వారు ఒకట్రెండు సార్లు గెలుస్తున్నారు. కానీ ఎన్నిసార్లు..? ఒక విజయం సరిపోతుందా..? రెండు విజయాలు చాలనా..? నిలకడగా విజయాలు సాధించడంలో విఫలమవుతున్నారు. ఆ నిలకడ ఒక్క మేరీ కోమ్కు మాత్రమే ఉంది” అని ఆమె అన్నారు.
‘యువ బాక్సర్లు ఒక విజయం సాధించగానే వారికి పేరు, ప్రఖ్యాతులు, డబ్బు అన్నీ ఒకేసారి వస్తాయి. దాంతో వారిలో గెలువాలన్న ఆకలి చచ్చిపోతోంది. సంతృప్తి పడిపోతున్నారు. ఆ తర్వాత వారి ప్రస్థానం అక్కడితో ఆగిపోతోంది. అందుకే మరో మేరీ కోమ్ వస్తారని నేను చెప్పలేను’ అని ఆమె అన్నారు. తన సుదీర్ఘ కెరీర్లో 50కి పైగా అంతర్జాతీయ మ్యాచ్లు గెలిచి, లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన మేరీ కోమ్.. నిలకడైన ప్రదర్శనకే తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని పరోక్షంగా తెలిపారు.
అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తున్న యువ ప్రతిభావంతులపై మేరీ కోమ్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా తన సొంత రాష్ట్రం మణిపూర్కు చెందిన జడుమణి సింగ్, అసోంకు చెందిన లవ్లినా బోర్గోహైన్ అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. “రాబోయే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్లో వారు కూడా సత్తా చాటాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈశాన్య రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రతిభ ఉంది” అని ఆమె పేర్కొన్నారు.
ఇంతటి ఘనమైన క్రీడా జీవితం ఉన్నప్పటికీ ‘బిగ్బాస్’ షోలో ఎందుకు పాల్గొంటున్నారని అడగ్గా.. అది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని మేరీ కోమ్ తెలిపారు. “ఇది ఒక పెద్ద వేదిక. అక్కడికి వెళ్లి, కొత్త విషయాలు తెలుసుకోవాలని, విభిన్న మనస్తత్వాలున్న మనుషులతో ఎలా మెలగాలో, ఎలా సంభాషించాలో నేర్చుకోవాలని అనుకుంటున్నాను” అని ఆమె తన ఉద్దేశాన్ని వివరించారు. ఆమె జీవితం ఆధారంగా 2014లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో ‘మేరీ కోమ్’ బయోపిక్ వచ్చింది.