Afganisthan : ఆఫ్గన్ ప్రభుత్వం విధిస్తున్న షరతులకు తాళలేక మహిళలు దేశం విడిచి వెళ్లడానికి సిద్ధపడిపోతున్నారు. ఇందులో భాగంగా కొందరు మహిళలు దేశం విడిచి వెళ్లడానికి సమయత్తమవుతున్నారు. అయితే వీరిని తాలిబాన్ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ మహిళలు అక్రమంగా దేశం విడిచి వెళుతున్నారని, అందుకే తాము అడ్డుకున్నామని తాలిబాన్ ప్రతినిధులు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం వారు తమ అదుపులోనే ఉన్నారని, వారి తరపున వారి బంధువులు వస్తే వదిలి వేస్తామని, అయితే పురుషులు మాత్రమే రావాలని, అప్పటి వరకూ తమ ఆధీనంలోనే ఉంటారని తాలిబాన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మొత్తం 40 మందిని అదుపులోకి తీసుకున్నామని, కొందర్ని ఇప్పటికే విచిడిపెట్టామని పేర్కొన్నారు.
అయితే ఈ వలసల పర్వం గతేడాది ఆగస్టులోనే ప్రారంభమైంది. ఆగస్టులోనే తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్గన్లో ఏర్పడింది. దీంతో చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారు. స్థానిక, అంతర్జాతీయ ప్రతినిధులు వారందర్నీ విమానాల్లో ఎక్కించి మరీ, దేశం దాటేలా ప్రయత్నాలు చేశారు. కొన్ని రోజుల తర్వాత తాలిబాన్ ప్రభుత్వం ఈ వలసలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఈ మహిళలను అడ్డుకుంది.
సరైన పత్రాలు చూపండి.. వెళ్లండి అంటూనే షరతులు
అయితే వీరందరూ దేశం విడిచి వెళ్లడానికి ఎవరు విమానాలను ఏర్పాట్లు చేస్తున్నారన్న విషయం ఇంకా తెలియలేదని తాలిబాన్ సర్కార్ పేర్కొంటోంది. అయితే సరైన పత్రాలు, ఆధారాలు చూపించి, దేశం విడిచి వెళ్లొచ్చని తాలిబాన్ ప్రతినిధులు అంటున్నారు. ప్రజలు మాత్రం మరోలా చెబుతున్నారు. తమకు దేశం విడిచి వెళ్లే ప్రక్రియలో అధికారులు ఏమాత్రం సహకరించడం లేదని, పత్రాల మంజూరులో లేనిపోని రూల్స్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.