న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఒకవైపు కేంద్రప్రభుత్వం చెబుతుండగా.. యూపీలోని వారణాసి, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో టీకా డోసుల కొరత వేధిస్తున్నది. టీకాల కొరత కారణంగా వారణాసిలోని 62 శాతం ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మరో మూడు రోజులకు సరిపడా టీకా డోసులు మాత్రమే ఉన్నాయని, వెంటనే 15-20 లక్షల డోసులను సరఫరా చేయాలని కేంద్రానికి ఒడిశా ప్రభుత్వం లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్లో 3.7 లక్షల టీకా డోసులే ఉన్నాయని, కోటి డోసుల కోసం కేంద్రానికి లేఖ రాయనున్నట్టు సంబంధిత అధికారి తెలిపారు.
వ్యాక్సినేషన్లో మనమే టాప్
వ్యాక్సినేషన్ భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం పేర్కొంది. దేశంలో రోజుకు సగటున 34,30,502 టీకా డోసులను ఇస్తున్నట్టు వెల్లడించింది. 13,77,304 సెషన్లలో ఇప్పటివరకూ 9,01,98,673 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు వివరించింది.
మహారాష్ట్రలో ‘వ్యాక్సిన్’ రచ్చ
మహారాష్ట్రలో కూడా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. టీకా డోసుల సరఫరాకు సంబంధించి కేంద్రప్రభుత్వానికి, మహారాష్ట్ర సర్కారుకు మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ, గుజరాత్, మధ్యప్రదేశ్, యూ పీతో పోలిస్తే తమకు తక్కువ వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయడానికి కారణమేంటని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ స్పందించారు. మహారాష్ట్ర సర్కార్ 5 లక్షల వ్యాక్సిన్ డోసులను వృథా చేసిందని ఆరోపించారు. టీకాను రాజకీయం చేయవద్దని, రాష్ర్టాలు-కేంద్రం ఉమ్మడిగా కరోనాపై పోరాడటం అవసరమని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ కేంద్రానికి హితవు పలికారు. ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం సరిగ్గా అమలుకావడంలేదని కేంద్రమంత్రి హర్షవర్ధన్ బుధవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. టీకా డోసులు అయిపోతుండటంతో శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్ను నిలిపేస్తున్నట్టు ముంబై మేయ ర్ కిశోరీ పెడ్నేకర్ తెలిపారు.
ఇవీ కూడా చదవండీ…
93 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి కేటీఆర్
పాకిస్థాన్కు ప్రత్యేక సైనిక సామాగ్రి ఇస్తాం : రష్యా
దివాళా అంచున కాఫీడే.. ఎందుకంటే..!