IISC | న్యూఢిల్లీ: మనచుట్టూ బోల్డంత నీరు ఉన్నా ఉపయోగానికి పనికొచ్చేది కొంతే. ఫలితంగా నీటి కొరత వేధిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నీటి కొరతను అధిగమించి శుద్ధ జలాన్ని అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) పరిశోధకులు పోర్టబుల్ థర్మల్ డీశాలినేషన్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ విధానంలో నీటిని తొలుత ఆవిరిగా మార్చి అందులోని ఉప్పు, ఇతర మలినాలను తొలగిస్తారు.
ఆ తర్వాత ఆవిరిని ఘనీభవించడం ద్వారా శుద్ధ జలాన్ని సేకరిస్తారు. పెద్దపెద్ద రిజర్వాయర్లు, సముద్రపు నీరు, ఉప్పునీటి కయ్యల్లోని నీరు, భూగర్భ జలాలను ఈ విధానంలో శుద్ధి చేయవచ్చని ఐఐఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుస్మితా దాస్ తెలిపారు. రోజులో సూర్యుడి గమనాన్ని బట్టి డీశాలినేషన్ యూనిట్ను మార్చుకునేలా డిజైన్ చేసినట్టు వివరించారు.