Five star Hotel | న్యూఢిల్లీ, జూన్ 21: ఏదైనా హోటల్లో దిగి బిల్లు కట్టకుండా ఒకటి రెండు రోజులకు మించి ఉండటం సాధ్యమా? సామాన్యులకు అది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి రోజులు.. నెలలు కాదు.. ఏకంగా సుమారు రెండు సంవత్సరాల పాటు.. అది కూడా ఫైవ్ స్టార్ హోటల్లో దర్జాగా ఉండి ఒక్క పైసా బిల్లు కట్టకుండా వెళ్లిపోయాడు. తమ హోటల్లోని కొందరు సిబ్బంది సహకారం వల్లే ఇది జరిగిందని, తమకు రూ.58 లక్షలు నష్టం వచ్చిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం సమీపంలో ఏరోసిటీలోని రోజేట్ హౌస్ అనే ఐదు నక్షత్రాల హోటల్లో అంకుశ్ దత్తా.. మే 30, 2019లో ఒక రాత్రి బస చేయడానికి దిగాడు. ఒక్క పైసా కూడా కట్టకుండా జనవరి 22. 2022 వరకు 603 రోజులు ఉండి తర్వాత ఖాళీ చేశాడు. ఈ విషయం అతను వెళ్లిపోయిన తర్వాత యాజమాన్యం గుర్తించింది.