భోపాల్: కొందరు వ్యక్తులు సోదరిని కిడ్నాప్ చేయడాన్ని ఆమె సోదరుడు అడ్డుకున్నాడు. ప్రతిఘటించిన అతడిపై వారు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి మరణించాడు. (Man Shot Dead) మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధర్నావాడ ప్రాంతంలో సంచార వర్గానికి చెందిన ఒక యువతిని కిడ్నాప్ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆ మహిళ సోదరుడైన 25 ఏళ్ల ధరంపాల్ పార్ది, కిడ్నాపర్లను ప్రతిఘటించాడు. ఈ క్రమంలో వారు అతడి కాలుపై గన్తో కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, రక్తం ధారగా కారడంతో ధరంపాల్ను తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి డాక్టర్లు భోపాల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సుమారు ఎనిమిది మంది వ్యక్తులపై హత్య కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులు, హతుడి మధ్య పాత శత్రుత్వం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.