ముంబై: ఇద్దరు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. ఒక్కటే గదిలో ఉంటున్నారు. చిన్న విషయంలో లొల్లి పెట్టుకున్నారు. దీంతో రూమ్మెట్ను చంపిన యువకుడు.. మృతదేహాన్ని పూడ్చేసి ఏమీ తెలియనట్లు రూమ్లో ప్రశాంతంగా పడుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది.
నాగ్పూర్లోని దాభా ప్రాంతంలోని ఓ గ్యారేజీలో రాజు నందేశ్వర్ (35), దేవాన్ష్ వఘోడే (26) మేకానిక్లుగా పనిచేస్తున్నారు. గ్యారేజీకి సమీపంలో ఓ గదిలో ఇద్దరు కిరాయికి ఉంటున్నారు. అయితే గత శనివారం రాత్రి పని ముగించుకుని గదికి వెళ్లిన తర్వాత ఇద్దరికి చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ముదిరి ఇద్దరు కొట్టుకునేదాకా వెళ్లింది. ఈ క్రమంలో దేవాన్ష్ చేతికి దొరికిన ఓ పదునైన వస్తువుతో రాజును బలంగా కొట్టాడు. దీంతో రాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడు మృతిచెందాడని నిర్ధారించుకున్న దేవాన్ష్.. రాజు మృతదేహాన్ని అదేరోజు రాత్రి తాముంటున్న గదికి సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో పాతిపెట్టాడు. అనంతరం తిరిగివచ్చి గదినంతా శుభ్రం చేసుకుని ఏమీ తెలియనట్లు ప్రశాంతంగా పడుకున్నాడు.
అయితే ఆదివారం ఉదయం ఖాళీ ప్రదేశంలో ఏదో పూడ్చినట్లు అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడ పరిశీలించిన పోలీసులకు అసలు విషయం బయటకు వచ్చింది అధికారులు తెలిపారు. దేవాన్ష్ను తమదైనశైలిలో ప్రశ్నించడంతో తానే హత్యకుపాల్పడినట్లు తెలిపాడన్నారు. దీంతో అతడిని అరెస్టుచేశామని, హత్యా నేరం కింద కేసు నమోదుచేశామన్నారు.