రాయ్పూర్: ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె ఇంటికి రావడంపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. భార్య, కుమార్తెలపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఒక కుమార్తె మరణించింది. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. అమర్ దేవ్ రాయ్ అనే వ్యక్తి డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఏడో తరగతి వరకు మాత్రమే చదివిన అతడు తన పిల్లలు ఉన్నతంగా చదివి మంచి ఉద్యోగాలు పొందాలని ఆశించాడు. అయితే అమర్ దేవ్ పెద్ద కుమార్తె వందన పొరుగున ఉండే అభిషేక్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఒకరు సంతానం.
కాగా, తనకు చెప్పకుండా, తన అంగీకారం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె వందనతో తండ్రి అమర్ దేవ్ మాట్లాడం లేదు. ఆమెను తన ఇంటికి కూడా రావద్దని చెప్పాడు. అయితే శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన అమర్ దేవ్, పెద్ద కుమార్తె వందన తన ఇంట్లో ఉండటం చూశాడు. దీనిపై భార్య, మిగతా కుమార్తెలను నిలదీశాడు. కుమార్తె వందన ప్రేమ పెళ్లిని వారంతా సమర్థించడంపై ఆగ్రహంతో రగిలిపోయాడు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రిస్తున్న భార్య, కుమార్తెలపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆ కత్తితోపాటు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
మరోవైపు అమర్ దేవ్ కత్తి దాడిలో రెండో కుమార్తె 18 ఏళ్ల జ్యోతి మరణించింది. మిగతా కుమార్తెలైన 17 ఏళ్ల ప్రీతి, 22 ఏళ్ల వందన, భార్య దేవంతి రాయ్కు తీవ్ర కత్తి గాయాలయ్యాయి. వారంతా స్థానిక ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. కాగా, మరో గదిలో నిద్రించిన 12 ఏళ్ల కుమారుడి జోలికి తండ్రి అమర్ దేవ్ వెళ్లలేదు. ఆ బాలుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.