లక్నో: ఆస్తి కోసం బంధువులు ఒక మహిళను హత్య (woman killed) చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి పడేసేందుకు క్యాబ్ బుక్ చేశారు. అయితే ఆ సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో మహిళను హత్య చేసిన ఆమె బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రూ.40 కోట్ల విలువైన వారసత్వ ఆస్తి కోసం కుసుమ్ కుమారిని ఆమె బంధువులు జూలై 11న హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక గోనె సంచిలో ఉంచారు. దానిని నిర్మాణుష్య ప్రాంతంలో పడేసేందుకు నోయిడా నుంచి మహారాజ్పూర్కు ఓలా క్యాబ్ను బుక్ చేశారు.
కాగా, క్యాబ్ డ్రైవర్ మనోజ్, బుకింగ్ చేసిన ప్రాంతానికి చేరుకున్నాడు. ఒక సంచిని కారు డిక్కీలో ఉంచేందుకు పైకి ఎత్తాడు. అయితే దాని నుంచి రక్తం కారడం చూసి అనుమానించాడు. క్యాబ్ బుక్ చేసిన వారిని తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో వారు అతడ్ని తిట్టారు. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. హైవేపై ఉన్న పోలీసులను అలెర్ట్ చేశాడు. అలాగే మహారాజ్పూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ విషయం చెప్పాడు.
మరోవైపు, క్యాబ్ డ్రైవర్ మనోజ్ చెప్పిన దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరా తీయగా సమీప గ్రామానికి చెందిన కుసుమ్ కుమారి, ఆమె బంధువు సౌరభ్ కనిపించడంలేదని తెలుసుకున్నారు. ఆదివారం ఫతేపూర్ వద్ద కుసుమ్ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె హత్యకు సంబంధించి ముగ్గురు బంధువులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సౌరభ్ అని పోలీస్ అధికారి తెలిపారు. ఈ హత్యకు సంబంధించి కొందరు పరారీలో ఉన్నారని, వారిని వెతికి పట్టుకుని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.