అహ్మదాబాద్: ఒక వ్యక్తి దర్జాగా పోలీస్ వాహనంలో పారిపోయాడు. (Man Flees With Police vehicle) చోరీ చేసిన ఆ వాహనంతో సెల్ఫీలు తీసుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. అయితే పోలీస్ వాహనం కనిపించకపోవడాన్ని గుర్తించిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. గుజరాత్లోని ద్వారకాలో ఈ సంఘటన జరిగింది. గురువారం మోహిత్ శర్మ బైక్పై ద్వారకా చేరుకున్నాడు. పోలీస్ స్టేషన్ సమీపంలో బైక్ను పార్క్ చేశాడు. ఆ తర్వాత ద్వారకా పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్యూవీలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, పోలీస్ వాహనంలో డీజిల్ నిండుగా ఉండటంతో 200 కిలోమీటర్ల దూరంలోని జామ్నగర్ వరకు ప్రయాణించాడు. మార్గమధ్యలో ఆ పోలీస్ వాహనంతో సెల్ఫీలు తీసుకున్నాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే పోలీస్ వాహనం కనిపించకపోవడాన్ని చాలా ఆలస్యంగా పోలీసులు గుర్తించారు. అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేశారు. చివరకు ఆరు గంటల తర్వాత పోలీస్ వాహనంతో ఉన్న మోహిత్ శర్మను అరెస్ట్ చేశారు.
మరోవైపు కచ్లోని గాంధీధామ్లో పరువు నష్టం కేసును అతడు ఎదుర్కొంటున్నాడని పోలీసులు తెలిపారు. గంజాయికి బానిస అయిన మోహిత్ శర్మ గతంలో దర్యాప్తు సందర్భంగా పోలీస్ వాహనాన్ని చోరీ చేస్తానని చెప్పాడని, తాజాగా దానిని అమలు చేశాడని చెప్పారు. స్క్రాప్గా అమ్మేందుకు పోలీస్ వాహనాన్ని చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.