Stalin-Mamata | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు ఫోన్ చేశారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల అధికార దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల విపక్ష నేతల మధ్య చర్చలు జరుగాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయ పడ్డారు. త్వరలో ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల సీఎం ఆధ్వర్యంలో ఢిల్లీలో సదస్సు నిర్వహించాలన్న అభిప్రాయం వచ్చిందని ఎంకే స్టాలిన్ తెలిపారు.
రాజ్యాంగాన్ని అతి క్రమించి వ్యవహరిస్తూ గవర్నర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారని స్టాలిన్ చెప్పారు. రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాపాడాలన్న వైఖరికే కట్టుబడి ఉన్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రికి హామీ ఇచ్చానని పేర్కొన్నారు.
రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా, సంప్రదాయాలను తోసిరాజంటూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ దన్కర్ ఆదేశాలు జారీ చేశారని స్టాలిన్ చెప్పారు. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిత్యం జగదీప్ దన్కర్ ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు, విమర్శల ద్వారా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల గవర్నర్ జగదీప్ దన్కర్ ట్విట్టర్ హ్యాండిల్ను అన్ఫాలో చేస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.