కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంటతడి పెట్టారు. సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్లో ఉద్యోగాల కోసం నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న అడగడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రశ్నలనే యూపీఎస్సీ అడుగుతున్నదని మండిపడ్డారు. ‘బీజేపీ ప్రశ్నలను యూపీఎస్సీ అడుగుతున్నది. యూపీఎస్సీ నిష్పక్షపాతంగా ఉండేది, కానీ బీజేపీ అడిగే ప్రశ్నలను దానికి ఇస్తోంది. యూపీఎస్సీ పేపర్లో రైతుల నిరసనపై ప్రశ్న కూడా రాజకీయ ప్రేరేపితమే’ అని మమతా బెనర్జీ విమర్శించారు. యూపీఎస్సీ వంటి సంస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆమె ఆరోపించారు. బెంగాల్లో కరోనా ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు.