కోల్కతా : తన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నకిలీ వ్యాక్సిన్ స్కామ్పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని ఆమె స్పష్టం చేశారు. జాతీయ టీవీ చానెళ్లను మోదీ ప్రభుత్వం డిక్టేట్ చేస్తూ దుష్ప్రచారం సాగిస్తోందని దీదీ మండిపడ్డారు. బెంగాల్ ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేందుకు హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం వేదికగా కుట్ర జరుగుతోందని విమర్శించారు.
బెంగాల్ కంటే చిన్న రాష్ట్రాలకు తమతో పోలిస్తే అధికంగా వ్యాక్సిన్ డోసులు పంపారని ఆరోపించారు. తమకు 1.99 కోట్ల వ్యాక్సిన్ డోసులు రాగా ఇప్పటికే 1.9 కోట్ల డోసులను ప్రజలకు అందించామని చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో కోల్కతాలో కేవలం రెండవ డోసు మాత్రమే వ్యాక్సినేషన్ సాగుతోందని తెలిపారు. కాగా కోల్కతాలో కొన్ని ప్రాంతాల్లో అనధికార వ్యాక్సిన్ క్యాంపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర నివేదిక అందించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బెంగాల్ సర్కార్ను కోరిన నేపథ్యంలో మోదీ సర్కార్పై దీదీ విరుచుకుపడ్డారు.