న్యూఢిల్లీ : ఉక్రెయిన్ – రష్యా మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై గత నెల 24న సైనిక చర్యను ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాల్లో తరలించింది. ఈ ప్రత్యేక ఆపరేషన్లో ప్రభుత్వానికి దేశానికి చెందిన పైలట్లు తమవంతు సహకారం అందించారు. ఇందులో ఒకరు మహాశ్వేత చక్రవర్తి. 24 సంవత్సరాల మహాశ్వేత అపార ధైర్యసాహసాలను కనబరిచి భారతీయులను కాపాడింది. పోలాండ్-హంగేరీ సరిహద్దు నుంచి 800 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది.
మహాశ్వేత కోల్కతాకు చెందిన 24 ఏళ్ల మహశ్వేతా ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. చిన్న తనం నుంచి పైలెట్ కావాలని లక్ష్యంగా పెట్టుకొని.. అందుకు అనుగుణంగా కష్టపడి చదివింది. గత నాలుగేళ్లుగా ఇండిగో ఎయిర్ లైన్స్లో కో-పైలట్గా విధులు నిర్వర్తిస్తుంది. ఆపరేషన్ గంగా ప్రాజెక్టులో పాల్గొనాలని అర్ధరాత్రి ఫోన్ కాల్ రావడంతో.. ఆ తర్వాత వెంటనే అన్ని ఏర్పాట్లు చేసుకొని విధుల్లో చేరింది. అనంతరం ఉక్రెయిన్కు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 7 వరకు ఆపరేషన్ గంగా ప్రాజెక్టులో పాల్గొని, 800 మంది భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కృషి చేసింది. పొలాండ్ నుంచి నాలుగు, హంగేరి నుంచి రెండు విమానాలకు పైలట్గా మహాశ్వేత పని చేసింది. తాజాగా ఆమె చూపిన ధైర్యసాహసాలను బీజేపీ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ ప్రియాంక శర్మ పైలట్ మహశ్వేత గురించి ట్వీట్ చేయగా.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.