ముంబై: లేడీ పోలీస్ కానిస్టేబుల్ పురుషుడిగా మారింది. (Maharashtra cop) మహిళతో పెళ్లి జరిగిన నాలుగేళ్ల తర్వాత మగ బిడ్డకు తండ్రైంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మజల్గావ్ తాలూకాలోని రాజేగావ్కు చెందిన లలితా సాల్వే పోలీస్ కానిస్టేబుల్గా సెలక్ట్ అయ్యింది. 25 ఏళ్ల వయసులో తన శరీరంలో మార్పులను ఆమె గమనించింది. 2013లో వైద్య పరీక్షలు చేయించుకోగా వై క్రోమోజోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.
కాగా, లేడీ కానిస్టేబుల్ లలితా సాల్వే 2017లో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. బాంబే హైకోర్టుతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతితో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు పలు సర్జరీల ద్వారా పురుషుడిగా మారింది. లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకున్న ఆ పోలీస్ కానిస్టేబుల్కు 2020లో ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్)కు చెందిన సీమాతో పెళ్లి జరిగింది. వివాహమైన నాలుగేళ్ల తర్వాత జనవరి 15న ఆ జంటకు బాబు పుట్టాడు.
మరోవైపు తండ్రి కావడం పట్ల లలిత్ కుమార్ సాల్వే ఆనందానికి అంతులేకుండా పోయింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. ‘స్త్రీ నుంచి మగవాడిగా నా ప్రయాణం కష్టాలతో నిండిపోయింది. ఈ సమయంలో చాలా మంది నన్ను ఆదరించి ఆశీర్వదించారు. నా భార్య సీమ బిడ్డను కనాలనుకుంది. ఇప్పుడు తండ్రిని అయినందుకు సంతోషంగా ఉంది. నా కుటుంబం థ్రిల్గా ఉంది’ అని చెప్పాడు. కుమారుడికి ఆరుష్ అని పేరు పెడతామని ఆ దంపతులు వెల్లడించారు.