ముంబై : కరువు పరిస్థితులపై సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రైఫ్రూట్స్ తింటూ కనిపించడం బీజేపీ పాలిత మహారాష్ట్రలో దుమారం రేపింది. మరాఠ్వాడా ప్రాంతంలో దారుణమైన కరువు పరిస్థితులపై నాందేడ్లో వ్యవసాయ మంత్రి దత్తాత్రేయ భామే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీడిపప్పు, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ పెట్టారు.
అధికారులు ఓ వైపు కరువు పరిస్థితులపై వివరిస్తుంటే.. ఇంకోవైపు మంత్రులు అతుల్ సావే, మేఘనా బోర్డికర్, అలాగే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు జీడిపప్పు, బాదం తింటున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే అంబాదాస్ దాన్వే తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి, కనీసం సానుభూతి లేకుండా వారి తీరు ఉందన్నారు. దీనిపై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఇలాంటి సున్నితమైన అంశాలపై చర్చిస్తున్నప్పుడు సున్నితత్వాన్ని ప్రదర్శించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.