ముంబై: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని జేజే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఎన్సీపీ సీనియర్నేత అయిన 62 ఏండ్ల నవాబ్ మాలిక్ ఇంటికి బుధవారం ఉదయం ఈడీ అధికారులు వెళ్లారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసుపై పలు గంటలపాటు ఆయనను ప్రశ్నించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
అరెస్ట్ తర్వాత మంత్రి నవాబ్ మాలిక్ను ఈడీ అధికారులు జేజే ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిబంధనల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఈడీ ప్రత్యేక కోర్టులో ఆయనను ప్రవేశపెట్టారు. 14 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్డును ఈడీ కోరింది. అయితే వారం రోజులపాటు అంటే మార్చి 3 వరకు ఈడీ రిమాండ్కు కోర్టు అంగీకరించింది. దీంతో ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు.
కాగా, గత బుధవారం నుంచి ఈడీ కస్టడీలో ఉన్న మంత్రి నవాబ్ మాలిక్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈడీ అధికారులు ఆయనను జేజే ఆసుపత్రిలో చేర్చారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నవాబ్ మాలిక్ సోదరుడికి కూడా ఈసీ సమన్లు జారీ చేసింది. అలాగే శివసేన కార్పొరేటర్ ఇళ్లలో అధికారులు సోదాలు జరిపారు.