ముంబై: గత వారం రోజులుగా అస్సాం రాజధాని గౌహతిలోని ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే బృందం ముంబైకి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే నేరుగా కాకుండా గౌహతి నుంచి గోవా వెళ్లి అక్కడి నుంచి ముంబైకు చేరి డైరెక్టుగా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు షిండే వర్గం రూట్ మ్యాప్ ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను మహారాష్ట గవర్నర్ భవవత్ సింగ్ కోశియారి ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్షను ఎదుర్కోవాలని పేర్కొన్నారు. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ గురువారం ప్రత్యేకంగా సమావేశం కానున్నది.
మరోవైపు తన వెంట ఉన్న 39 మంది రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరవుతానని గౌహతిలోని ఫైవ్ స్టార్ హోటల్లో మకాం వేసిన ఏక్నాథ్ షిండే తెలిపారు. అయితే ముంబై ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేరుగా అసెంబ్లీకి వెళ్లేలా ప్లాన్ సిద్దం చేశారు. కాగా, గౌహతి నుంచి ముంబైకి విమానంలో వెళ్లేందుకు మూడు గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా లేదా ఆలస్యంగా అసెంబ్లీకి చేరుకోకూడదని షిండే వర్గం భావిస్తున్నది.
దీంతో షిండే వర్గం గౌహతి నుంచి మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాకు బుధవారం మకాం మార్చనున్నది. గోవా రాజధాని పనాజీలోని తాజ్ కన్వెషన్ హాల్లో షిండే వర్గం కోసం 71 గదులు బుక్ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో బుధవారం రాత్రి ఆ హోటల్లో బస చేయనున్న షిండే వర్గం గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో గోవా నుంచి బయలుదేరి ముంబైలో ల్యాండ్ అవుతారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే ఉదయం 11 గంటలకు అక్కడకు చేరుకుంటారు.
కాగా, బలపరీక్షను ఎదుర్కోవాలన్న గవర్నర్ ఆదేశాన్ని సీఎం ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్పై బుధవారం సాయంత్రం 5 గంటలకు విచారణ జరుపనున్నది. ఈ నేపథ్యంలో రెబల్స్ షిండే వర్గం ముంబైకి తిరిగి వచ్చే ప్లాన్ సుప్రీంకోర్టు ఉత్తర్వులపై ఆధరపడి ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు షిండే వర్గానికి జూలై 12 వరకు సప్రీంకోర్టు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.