పుణె: దారితప్పిన ఓ అడవిదున్న సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి ప్రవేశించింది. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ అడవిదున్నను తిరిగి అడవిలోకి మళ్లించడానికి అక్కడికి చేరుకున్నారు. అడవిదున్నను పరిశీలించి.. అది కలవర పడుతున్నదని, ఎవరూ దాన్ని డిస్టర్బ్ చేయవద్దని మైకులో హెచ్చరించారు. కానీ వారి హెచ్చరికలను లెక్కచేయకుండా కొందరు గ్రామస్తులు ఆ అడవిదున్నను వెంటపడి తరిమారు.
దాంతో కొంతదూరం పరుగెత్తిన అడవిదున్న ఆగ్రహంతో వెనక్కి తిరిగింది. తనను తరుముతూ వచ్చిన వారిపై ఒక్కసారిగా దాడికి దిగింది. ఈ ఘటనలో సౌరవ్ ఖోట్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బెదిరిపోయిన అడవిదున్నను తిరిగి అడవిలోకి మళ్లించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కార్వీర్ తాలూకాలోని భుయెవాడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.