Covid | మధ్యప్రదేశ్లో ఓ విపరీతం జరిగింది. అక్కడి ఆరోగ్య శాఖ చేసిన నిర్వాకం ఓ 60 ఏళ్ల వృద్ధురాలికి కోపం తెప్పించింది. రామ్ ప్యారీ (60) అనే వృద్ధురాలు ఛతర్పూర్ లోని గౌరీహార్ అనే గ్రామంలో నివసిస్తుంది. అయితే ఆమెకు పాజిటివ్ వచ్చిందని, ఆమె ఇంటిని కంటైయిన్మెంట్ జోన్గా ప్రకటించి, ఆమె ఇంటికి ఓ పోస్టర్ను కూడా అతికించేశారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత 5 నెలలుగా తాను బయటికే వెళ్లలేదని, ఆస్పత్రికి కూడా వెళ్లలేదని పేర్కొంటోంది. ఎలాంటి టెస్టులకు కూడా వెళ్లలేదని స్పష్టం చేస్తోంది.
5 నెలల క్రితం కంటి అద్దాల కోసమని తాను ఆస్పత్రికి వెళ్లాలని, అప్పటి నుంచి అడుగు కూడా బయట పెట్టలేదని, తనకు ఎలాంటి రోగాలు కూడా లేవని చెబుతోంది. అయితే ఆరోగ్య శాఖ వాదన మరోలా వుంది. ఐదో తారీఖున ఆమె ఆస్పత్రికి వచ్చిందని, కోవిడ్ టెస్టు కూడా చేయించుకుందని ఆరోగ్య శాఖ వాదిస్తోంది. ఆ టెస్టుల్లో ఆమెకు పాజిటివ్ అని తేలిందని, అందుకే ఇంటికి పోస్టర్ను అతికించామని పేర్కొంటోంది. ఆరోగ్య శాఖ వారు కంటైయిన్మెంట్ పోస్టర్ అతికించడంతో అటు వైపు ఎవరూ వెళ్లడం లేదు. ఇరుగు పొరుగు వారు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. నాకు ఎలాంటి అనారోగ్యమూ లేదని, అయినా కోవిడ్ అంటున్నారని అధికారులపై ఆ వృద్ధురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి స్పందించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.