లక్నో: ఒక ఎల్పీజీ ట్యాంకర్ టోల్ బూత్ను ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్లోని గ్యాస్ లీకైంది. ఆ వెంటనే భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. (LPG Tanker Explodes) ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 26న ఉదయం 6:40 గంటల సమయంలో సిరోహి టోల్ ప్లాజా వైపు రెండు ఎల్పీజీ ట్యాంకర్లు వచ్చాయి. వాటిలో ఒకటి అదుపుతప్పింది. డివైడర్ను ఢీకొట్టి టోల్ బూత్లోకి దూసుకెళ్లింది.
కాగా, కాన్పూర్ నుంచి ప్రతాప్గఢ్కు వెళ్తున్న ఈ ఎల్పీజీ ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అయ్యింది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే భారీ పేలుడు సంభవించింది. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఈ మంటలు కనిపించాయి. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే జిల్లాలోని అన్ని అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పలు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు.
మరోవైపు ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ 40 ఏళ్ల ధర్మేంద్ర దూబే, టోల్ ప్లాజా ఉద్యోగి అలోక్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. టోల్ ప్లాజాకు చెందిన మరి కొందరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన అనిల్ కుమార్ చికిత్స పొందుతూ జూలై 1న మరణించాడు. సహోద్యోగులైన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి చెందిన హీరామణి సింగ్, మధ్యప్రదేశ్కు చెందిన కృష్ణ పాల్ మౌర్య మరునాడు చనిపోయారు.
అయితే ఆ టోల్ ప్లాజా సమీపంలో పార్క్ చేసిన 16 బైకులు, రెండు కార్లు కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదం తర్వాత ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు కొంతసేపు వాహనాలను టోల్ ప్లాజా గుండా ఉచితంగా వెళ్లేందుకు అనుమతించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కోసం ఒక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన గ్యాస్ ట్యాంకర్ పేలుడు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Terrifying CCTV footage captures an LPG tanker crashing into the toll plaza, leaking gas, and erupting into a massive fireball within seconds. The incident has claimed multiple lives, with several toll workers suffering severe burn injuries.
📍Sirohi Toll Plaza, Kaushambi, UP pic.twitter.com/b77AzdOtEl
— Deadly Kalesh (@Deadlykalesh) July 3, 2026