అహ్మదాబాద్, డిసెంబర్ 3: గుజరాత్లో బీజేపీకి తేడా కొడుతున్నదా? తొలి విడత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం పట్ల ఆ పార్టీ కంఫర్ట్గా లేదా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. తొలి విడతలో 89 సీట్లకు గానూ 63.3% పోలింగ్ నమోదైంది. 2017తో పోలిస్తే 3.4 శాతం తక్కువ. గత ఎన్నికల్లో తొలి విడతలో 66.79% నమోదైంది. పోలింగ్ శాతం పట్టణాల్లో భారీగా తగ్గింది. రాజ్కోట్, జామ్నగర్ నియోజకవర్గాల్లోనే మరీ దారుణం. జామ్నగర్లో గతంలో పోలైన ఓట్ల కంటే ఈసారి 10.56% తగ్గటం గమనార్హం. దీనికి ధరల పెరుగుదల, ప్రజల్లో వ్యతిరేకత తదితర కారణాలను నెటిజన్లు పేర్కొంటున్నారు. పోలింగ్ శాతంపై శనివారం ట్విట్టర్లో సుదీర్ఘ చర్చ జరిగింది. బీజేపీ విధానాలు, ధరల పెరుగుదలపై గుజరాత్ పట్టణవాసులు, యువత, విద్యావంతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోవటాన్ని ప్రస్తావించారు. తొలి విడత పోలింగ్ సందర్భంగా కొందరు సైకిళ్లపై(పెట్రో ధరలను నిరసిస్తూ), సిలిండర్లతో, నూనె ప్యాకెట్లతో(ధరల పెరుగుదలను నిరసిస్తూ) పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఫొటోలు ఎక్కువగా షేర్ అయ్యాయి. కాగా, సోమవారం 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పోస్టర్లు వేయించింది. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే, ఈసీ చర్యలు బీజేపీ కోసమేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల పోస్టర్లపై బీజేపీ గుర్తు కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, పోలింగ్ శాతంపై కేంద్ర హోం మంత్రి అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. దీంతో శనివారం అహ్మదాబాద్లో పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. గుజరాత్లో పరిస్థితులు కమలం పార్టీ చేయి దాటిపోతున్నాయన్న సంకేతాలు వస్తున్నందునే అమిత్ షా సమావేశం నిర్వహించినట్టు నెటిజన్లు పేర్కొంటున్నారు.