Liquor Shops: ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాంతో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నది.
ఈ నేపథ్యంలో శ్రీరాముడిపై భక్తితో కొందరు జనానికి అక్షింతలు పంపిణీ చేస్తున్నారు. ఓ ఆభరణాల వ్యాపారి అయోధ్య నమూనాతో వెండి ఉంగరాలను తయారీ చేసి విక్రయిస్తున్నాడు. ఓ టాటూ కళాకారుడు అయోధ్యలో అడిగిన వాళ్ల శరీరాలపై ఉచితంగా టాటూలు వేస్తున్నాడు. ఇలా ఎవరికి తోచిన కార్యక్రమాలను వాళ్లు నిర్వహిస్తున్నారు.
ఇదే క్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకున్నది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న రాష్ట్రంలో లిక్కర్ దుకాణాలు, బార్లు బంద్ పాటించాలని ఆదేశించింది. లైసెన్స్డ్ లిక్కర్ వ్యాపారులకు కూడా ఇందులో మినహాయింపు లేదని, అందరూ బంద్ పాటించాల్సిందేనని ఉత్తరాఖండ్ ఎక్సైజ్ కమిషనర్ హరిచంద్ర తన ఆదేశాల్లో పేర్కొన్నారు.