కోల్కతా: సింహాల పేర్ల వివాదంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) కోర్టును ఆశ్రయించింది. ‘అక్బర్’ పేరున్న మగ సింహం, ‘సీత’ పేరున్న ఆడ సింహాన్ని ఒకే ఎన్క్లోజర్లో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. (Lioness ‘Sita’ housed with lion ‘Akbar’) అటవీ శాఖ పాల్పడిన ఈ చర్య వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించింది. ఆడ సింహం పేరు మార్పు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. సిలిగురి సఫారీ పార్క్లోని ఎన్క్లోజర్లో ‘సీత’ అనే ఆడ సింహంతో పాటు ‘అక్బర్’ అనే మగ సింహాన్ని ఉంచారు.
కాగా, బెంగాల్ అటవీ శాఖ చర్యను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర వీహెచ్పీ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. ఈ చర్య హిందూ మతాన్ని అవమానించడమేనని, హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆరోపించింది. ఆడ సింహం పేరును మార్చాలని కోరుతూ జల్పాయిగురి బెంచ్లో ఫిబ్రవరి 16న పిటిషన్ వేసింది. ఫిబ్రవరి 20న ఈ పిటిషన్పై విచారణ జరుగనున్నది.
మరోవైపు బెంగాల్ అటవీ శాఖ దీనిపై స్పందించింది. మగ, ఆడ సింహాలను త్రిపురలోని సెపాహిజాలా జూలాజికల్ పార్క్ నుంచి నుంచి సిలిగురిలోని సఫారీ పార్క్కు ఇటీవల తరలించినట్లు తెలిపింది. వాటిని ఇక్కడకు తీసుకురాక ముందు నుంచే అక్బర్, సీత పేర్లు ఉన్నాయని చెప్పింది. తాము కొత్తగా ఎలాంటి పేర్లు పెట్టలేదని వెల్లడించింది.