పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్సింగ్ రాణేకు జీవితకాల క్యాబినెట్ హోదా లభించింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గురువారం ఈ విషయం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్సింగ్ రాణేకు కేబినెట్లో శాశ్వత హోదా కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. గోవా శాసనసభ మాజీ స్పీకర్ కూడా అయిన రాణే శాసనసభ్యుడిగా ఏండ్లు పూర్తి చేసుకున్నందున ఆయనకు ఈ గౌరవం ఇవ్వాలని తమ కేబినెట్ నిర్ణయించిదన్నారు. ఎమ్మెల్యేగా 50 ఏండ్లు పూర్తి చేసుకున్న మాజీ ముఖ్యమంత్రులు లేదా మాజీ స్పీకర్లకు భవిష్యత్తులో అలాంటి హోదా ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిందని సీఎం సావంత్ తెలిపారు.
కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన 87 ఏండ్ల ప్రతాప్సింగ్ రాణే ప్రస్తుతం పోరియం అసెంబ్లీ సెగ్మెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.1987 నుంచి 2007 వరకు నాలుగు సార్లు వివిధ సందర్భాల్లో గోవా సీఎంగా ఉన్నారు. మరోవైపు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి, రాణే కుమారుడు విశ్వజిత్ దీనిపై హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రతాప్సింగ్ రాణేకు జీవితకాల క్యాబినెట్ హోదా కల్పించిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తోపాటు మంత్రివర్గానికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిగా, స్పీకర్గా, ఎమ్మెల్యేగా తన తండ్రి 50 ఏండ్ల ప్రజా సేవను గౌరవించుకోవడానికి ఇంతకంటే గొప్ప మార్గం లేదన్నారు.