బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సవాల్ (Siddaramaiah challenge to Modi) విసిరారు. ‘నాతో కలిసి పరుగెత్తగలరా? ఎవరు అలసిపోయారో చూద్దాం’ అని అన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సిద్ధరామయ్యను ప్రధాని మోదీ విమర్శించారు. క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ పేరుతో మాజీ సీఎం ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య దీనికి కౌంటర్ ఇచ్చారు. ‘అలసిపోయారన్న ఉద్దేశంతోనే బీఎస్ యెడియూరప్పను సీఎం పదవి నుంచి మీరు తొలగించారా? ఆపై ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఆయనను ఎందుకు వేడుకున్నారు?’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. ‘నేను మీరు కలిసి పరుగెత్తుదాం. ఎవరు అలసిపోయారో చూద్దాం’ అని సవాల్ విసిరారు. చివరి శ్వాస వరకు తన ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయనతో కలిసి పరుగెత్తిన వీడియో క్లిప్ను కూడా షేర్ చేశారు. దానిని ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ తనపై చేసిన విమర్శలకు సంబంధించిన వార్తా కథనాన్ని కూడా ఆ ట్వీట్లో జత చేశారు.
కాగా, తనకు ఇవే చివరి ఎన్నికలని, ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని సిద్ధరామయ్య గతంలో ప్రకటించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా తాను క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని ఆ తర్వాత అన్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది కాంగ్రెస్ నేతలు క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ పేరుతో ప్రజల సానుభూతితో ఓట్లు అడుగుతున్నారని శనివారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ విమర్శించారు. దీంతో సిద్ధరామయ్య ఈ మేరకు ఆయనకు కౌంటర్ ఇచ్చారు.
Did you, Mr @narendramodi, remove @BSYBJP as CM because he was tired? And then you begged him to campaign for you in the elections.
Let us, you & me, go for a run & see who is tired.
I will serve my people till my last breath.. pic.twitter.com/LruDlshnDm
— Siddaramaiah (@siddaramaiah) April 30, 2023